వ్యాపం స్కాం.... 2013లో మధ్యప్రదేశ్లో జరిగిన ఈ కుంభకోణం దేశంలో సంచలనం సృష్టించింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కు సంబంధించిన ఈ కేసులో మోసం, అవకతవకలు వంటి ఆరోపణలతో వేల మందిని అరెస్టు చేశారు. వ్యాపం అంటే వ్యవసాయిక్ పరీక్షా మండల్. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ను ఇది నిర్వహిస్తూ ఉంటుంది.
అయితే ఈ కేసు వార్తల్లోకి వచ్చింది మాత్రం కుంభకోణంతో సంబంధం ఉన్నవారు చనిపోయినప్పుడు. 2013లో ఈ స్కాం వెలుగులోకి రాకముందే ఒకరి తర్వాత మరొకరు వరుసగా చనిపోవడం మొదలైంది. గుండెపోటు, ఛాతిలో నొప్పి, రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య వంటివి మరణానికి కారణాలుగా విచారణలో పేర్కొన్నారు. కానీ అన్ని మరణాలు అనుమానాస్పదంగానే జరిగాయి.
వ్యాపం కుంభకోణానికి సంబంధించి జరిగిన మరణాల మీద సీబీఐ దర్యాప్తు చేపట్టింది. చనిపోయిన వ్యక్తులు ఎవరు? వారు ఎలా చనిపోయారు? ఈ మరణాల మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలు వినిపించాయి.
మరింత సమాచారం కోసం కిందకు స్క్రాల్ చేయండి.
నమ్రతా దామోర్ వయసు: 19 మరణానికి కారణం: అనుమానాస్పద ఆత్మహత్య
ఇందోర్లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్న 19 ఏళ్ల నమ్రతా దామోర్ జనవరి 2012లో ఒక రోజు ఉదయం అదృశ్యమైంది. జనవరి 7, 2012న ఆమె మృతదేహాన్ని ఉజ్జయిని రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది. ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆమె మరణాన్ని హత్యగా నమోదు చేశారు.
తొలుత ఆమె పెదవులపై గాయాలతోపాటు, కొన్ని పళ్లు ఊడిపోయినట్లు రాశారు. కానీ పోలీసులు ఆ పోస్ట్మార్టం నివేదికను తిరస్కరించి, రెండవసారి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ తరువాత ఆమె మరణాన్ని ఆత్మహత్యగా రికార్డ్ చేశారు.
ఇది జరిగిన మూడేళ్ల తర్వాత ప్రముఖ మీడియా సంస్థకు చెందిన అక్షయ్ సింగ్ అనే జర్నలిస్ట్ నమ్రత తండ్రిని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లారు. కానీ ఇంటర్వ్యూను రికార్డ్ చేయడానికి ముందే అతను దగ్గుతూ నోట నురుగలు కక్కుకుంటూ చనిపోయారు.
అక్షయ్ సింగ్ వయసు: 38 మరణానికి కారణం: తెలియదు
మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లాలో ఉన్న నమ్రత తండ్రి మెహతాబ్ సింగ్ దామోర్ ఇంటికి అక్షయ్ సింగ్ చేరుకున్నారు. 2012లో మెహతాబ్ సింగ్ కుమార్తె నమ్రతా దామోర్ అనుమానాస్పద మృతిపై ఆయన మాట్లాడాలనుకున్నారు. తండ్రి మెహతాబ్ సింగ్ కూడా మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ ముఖాముఖిగా కూర్చున్నారు. మెహతాబ్ సింగ్ తన పిటిషన్ల ఫోటోకాపీలు, కోర్టు నిర్ణయాన్ని ముందు కూర్చున్న అక్షయ్ సింగ్కు అందజేశారు. టీ వచ్చింది. అక్షయ్ సింగ్ టీ తాగగానే ముఖం బిగుసుకుపోయి పెదవులపై నురగతో నేలపై పడిపోయాడు.
అక్షయ్ సింగ్ను మెహతాబ్ సింగ్ దామోర్ ఇంటికి తీసుకెళ్లిన ఇందోర్కు చెందిన స్థానిక జర్నలిస్ట్ రాహుల్ కరియా ఈ వివరాలు చెప్పారు. "మేము అతన్ని నేలపై పడుకోబెట్టాం. అతని బట్టలు విప్పి, అతని ముఖం మీద నీరు చల్లాం. అతని పల్స్ చెక్ చేస్తే చనిపోయినట్లు అనిపించింది" అని రాహుల్ కరియా అన్నారు. వెంటనే అతడిని సివిల్ ఆసుపత్రికి, ఆ తరువాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా వైద్యులు కాపాడలేకపోయారు. పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం గుండెపోటుతో చనిపోయాడని, చనిపోయే సమయానికి గుండె పరిమాణం పెరిగిందని తెలిపారు.
ఇది జరిగిన ఒక రోజు తర్వాత, వ్యాపమ్లో పాల్గొన్న విద్యార్థుల జాబితాను సిద్ధం చేస్తున్న మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ దిల్లీలోని ఒక హోటల్లో శవమై కనిపించారు.
డా.అరుణ్ శర్మ వయసు: 64 మరణానికి కారణం: అనుమానాస్పద మృతి
జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్గా శర్మ పని చేసేవారు. మధ్యప్రదేశ్లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఈయన 200కు పైగా డాక్యుమెంట్లను సమర్పించారు. పరీక్షల్లో రిగ్గింగ్కు పాల్పడిన విద్యార్థుల జాబితాను శర్మ స్వయంగా సిద్ధం చేశారు.
అక్షయ్ మరణించిన ఒక రోజు తర్వాత, దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న హోటల్ ఉప్పల్లో బెడ్ మీద చనిపోయి కనిపించారు. ఆ సమయంలో ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున తనిఖీ నిర్వహించేందుకు త్రిపుర రాజధాని అగర్తలాకు వెళుతున్నారు. ఆయన ఉన్న గదిలో ఖాళీ మద్యం సీసాను పోలీసులు గుర్తించారు. శర్మ రాత్రిపూట ఎక్కువగా మద్యం సేవించాడని, రాత్రి వాంతులు కూడా చేసుకున్నారని తేలింది.
శర్మ మృతికి సహజ కారణాలేనంటూ ఈ కేసును విచారిస్తున్న అధికారి విచారణను ముగించారు. ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మెడికల్ కాలేజ్ డీన్లలో శర్మ రెండో వ్యక్తి. అంతకు ముందు ఏడాది కిందట జబల్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన మరో డీన్ తన ఇంటి వెనుక ఉన్న తోటలో ఆత్మహత్య చేసుకున్నారు.
డా.డీకె షాకలే మరణానికి కారణం: ఆత్మహత్య అని అనుమానం
జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్గా డాక్టర్ డీకే షాకలే ఉండేవారు. వ్యాపమ్ మీద దర్యాప్తు చేస్తున్న కళాశాల అంతర్గత విచారణ కమిటీకి ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. ఉదయం 8.45 గంటలకు ఆయన భార్య వాకింగ్కు వెళ్లిన సమయంలో మంటల్లో కాలిపోతూ ఇంటి నుంచి బయటకు వస్తూ డీకే షాకలే కనిపించారు.
ఇది ఆత్మహత్య అని, ఆయన మరణం అనుమానాస్పదం కాదని పోలీసులు ప్రకటించారు. అయితే, ఆ నివేదికను డీకే అనుచరులు కొంతమంది ఒప్పుకోలేదు. ఆయన మరణం ఆత్మహత్య కాదని, దాని మీద సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర రాజ్ పుత్ వయసు: 35 మరణానికి కారణం: తెలియదు
మధ్యప్రదేశ్లోని ఝాన్సీ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చేశారు నరేంద్ర రాజ్పుత్. ఆ తరువాత సొంత ఊరైన హర్పాల్పుర్కు వచ్చి క్లినిక్ ప్రారంభించారు. ఆ తరువాత ఆరు నెలలకు ఆయన చనిపోయారు.
ఏప్రిల్ 13, 2014న పొలంలో పని చేస్తున్నప్పుడు హఠాత్తుగా గుండెలో నొప్పి వస్తోందని నరేంద్ర చెప్పారు. వెంటనే ఇంటికి బయలుదేరిన ఆయన, ఇంటి ముందే కుప్పకూలారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆయన మరణానికి స్పష్టమైన కారణం తెలియలేదు. తరువాత ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ రైతు బీమా పథకం కింద బీమా ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మరణానికి గల కారణాలను పోస్ట్మార్టం నివేదిక వెల్లడించకపోవడంతో కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనాలు అందలేదు.
నరేంద్ర మృతి చెందిన కొన్ని నెలల తర్వాత పోలీసులు వ్యాపమ్ స్కామ్లో ఆయన మధ్యవర్తిగా ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆయన మీద కేసు నమోదైనట్లుగా చెప్పారని బంధువులు తెలిపారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2007 నుంచి 2015 మధ్య వ్యాపం కేసుకు సంబంధించి 32 మంది మరణించారు. కానీ మీడియా నివేదికలు, లెక్కల ప్రకారం, ఈ కేసులో 40 మందికి పైగా చనిపోయారు. మీడియా ప్రస్తావించిన కేసులను, స్పెషల్ టాస్క్ ఫోర్స్తోపాటు సీబీఐ కూడా చార్జ్ షీట్లో చేర్చాయి.
వ్యాపం కేసుకు సంబంధించి మరింత మంది చనిపోయినట్లుగా ఆరోపణలున్నాయి.
చనిపోయిన వారి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శైలేష్ యాదవ్
వికాస్ పాండే
ఆనంద్ సింగ్ యాదవ్
అన్షుల్ సచాన్
జ్ఞాన్ సింగ్ యాదవ్
తరుణ్ మాఛర్
డా.రాజేంద్ర ఆర్య
ప్రమోద్ శర్మ (రింకూ)
దేవేంద్ర నాగర్
బంతీ శికరవార్
దినేశ్ జాటవ్
నరేంద్ర సింగ్ తోమార్
అరవింద్ శాక్య
అశుతోష్ తివారీ
కులదీప్ మారావీ
వికాస్ భరత్ సింగ్
డా.రామేంద్ర సింగ్ భదోరియా
లలిత్ కుమార్ గొలరియా
విజయ్ ఛోటెలాల్ సింగ్
అమిత్ సాగర్
ప్రవీణ్ యాదవ్
2013లో మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కింద నిర్వహించిన 27 వేర్వేరు పరీక్షలకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు.
ఈ సంఖ్య ఫ్రాన్స్ రాజధాని పారిస్ జనాభాకు దాదాపు సమానం.
మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం నిర్వహించిన పీఎంటీ పరీక్షకు దాదాపు 40,000 మంది విద్యార్థులు హాజరయ్యారంటే ఈ పరీక్షలకు ఎంత పోటీ ఉండేదో అంచనా వేయొచ్చు.
ఈ 40 వేల మంది విద్యార్థుల్లో 1600 మంది మాత్రమే అర్హత సాధించారు.
పరీక్షల్లో మోసాలు ఎలా జరిగాయి?
వ్యాపమ్ పరీక్షలకు సంబంధించిన మోసాలు, అక్రమాల్లో దళారులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, బయటి వ్యక్తులు, వైద్యులు, రాజకీయ నాయకులు ఉన్నారు.
అసలు అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాయడం
అసలు అభ్యర్థులకు బదులుగా ఇతరులు మోసపూరితంగా పరీక్షలకు హాజరయ్యారు. ఇలా వేరే వాళ్ల చేత పరీక్షలు రాయించేందుకు విద్యార్థుల నుంచి దళారులు డబ్బులు వసూలు చేస్తారు.
పరీక్షా కేంద్రాల్లోనూ అవకతవకలు జరిగాయి. నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ లో మధ్యవర్తులు, డమ్మీ అభ్యర్థులు కలిసికట్టుగా పని చేశారు.
ఇంజిన్-బోగీ సిస్టమ్
రోల్ నంబర్లను తారుమారు చేయడం అనేది చీటింగ్ పద్ధతుల్లో అతి సాధారణమైనది. ఒక అభ్యర్థి (బోగీ) పక్కన మరొక నకిలీ అభ్యర్థి(ఇంజిన్) వచ్చేలా రోల్ నంబర్లను సెట్ చేస్తారు. వీరు పరస్పరం మాట్లాడుకుంటారు. బోగీకి ఎక్కువ మార్కులు వచ్చేలా ఇంజిన్ సమాధానాలు ఇచ్చి సాయపడుతుంది.
మార్కుల షీట్ను ట్యాంపర్ చేయడం
పరీక్ష జరిగినప్పుడు దరఖాస్తుదారులు ఉద్దేశపూర్వకంగా తమ జవాబు పత్రాలను ఖాళీగా ఉంచుతారు.
ఆ తరువాత మధ్యవర్తులు కంప్యూటర్లోని మార్కుల షీట్లను తారుమారు చేస్తారు. తద్వారా అభ్యర్థులు పాస్ మార్కులు పొందేలా చూస్తారు.
అంతేకాకుండా పరీక్షలకు హాజరు కాకుండానే మార్కులు సాధించి సీట్లు పొందేలా కొందరు అభ్యర్థులు దళారులకు డబ్బులు చెల్లించారు. రాజకీయ నాయకులు, డాక్టర్లు వంటి వారు ఈ మోసపూరిత ప్రక్రియలో నేరుగా పాల్గొనక పోయినా ఈ అక్రమాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారు.
వ్యాపమ్ కేసులో ‘మధ్యవర్తులు’గా ఉన్న చాలా మంది అనుమానాదాస్పద రీతిలో చనిపోయారు.
మరణాల సంఖ్య సరీగ్గా లేకపోవడం అనుమానాలను లేవనెత్తుతున్నాయి. ఈ కేసులపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని తెలుపుతోంది. ఈ మరణాలకు సంబంధించి ఏదైనా అంతర్లీన సంబంధం లేదా సారూప్యత ఉందా అని తెలుసుకునే లక్ష్యంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.
మరోవైపు మరణాలకు సంబంధించి చాలా కేసుల్లో సరైన ఆధారాలు లేకపోవడం వల్ల వాటిని మూసివేశారు. ఉజ్జయిని రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద పరిస్థితుల్లో వైద్య కళాశాల విద్యార్థి నమ్రతా దామోర్ మృతదేహం లభ్యమైంది. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా పరిగణిస్తూ ప్రత్యేక కోర్టులో ఈ కేసును మూసివేయాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. నమ్రత తండ్రి మెహతాబ్ దామోర్ బీబీసీతో మాట్లాడుతూ దర్యాప్తు తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.